మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో కరోనాపై కాంగ్రెస్‌ కమిటీ

కరోనా సంక్షోభంపై కాంగ్రెస్‌ సంప్రదింపుల బృందానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నియమితులయ్యారు. 11మంది సభ్యులుగల ఈ బృందంలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు పీ చిదంబరం, జైరాంరమేశ్‌, మనీస్ తివారీ, కేసీ వేణుగోపాల్‌, ప్రవీన్‌ చక్రవర్తి, రణదీప్ సుర్జేవాలా తదితరులు ఉన్నారు. కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా దేశంలో ఏర్పడిన పరిస్థితుల గురించి ఈ బృందం రోజూ వర్చువల్‌ సమావేశాలు నిర్వహించి చర్చిస్తుందని పార్టీ నేత వేణుగోపాల్‌ తెలిపారు. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు నేతలు వివిధ అంశాలపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారు. గత గురువారం మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్‌గాంధీ ప్రజలు కష్టపడుతున్నప్పుడు తాము ఇండ్లకే పరిమితం కాలేమని, ఏ వ్యాధికన్నా దేశం గొప్పదని నిరూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.